మదురోను ఫెడరల్ కోర్టులో హాజరుపరిచిన అమెరికా అధికారులు.. నేరాలు రుజువైతే మరణశిక్ష పడే అవకాశం

వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా అధికారులు ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. నార్కో టెర్రరిజం సహా పలు తీవ్రమైన ఆరోపణలపై వారిని విచారిస్తున్నారు. వెనిజువెలాలో అమెరికా దళాలు జరిపిన మెరుపుదాడిలో శనివారం పట్టుబడిన వీరిని న్యూయార్క్‌కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫెడరల్ జడ్జి అల్విన్ హెల్లర్‌స్టెయిన్ ఎదుట వారిని ప్రవేశపెట్టారు.

భారీ భద్రత నడుమ మదురో దంపతులను బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ (MDC) నుంచి హెలికాప్టర్‌లో మాన్‌హాటన్‌లోని కోర్టుకు తరలించారు. కోర్టు తరఫున నియమితులైన లాయర్ డేవిడ్ విక్‌స్ట్రోమ్ వీరి తరఫున వాదనలు వినిపించనున్నారు. విచారణలో భాగంగా తాము నిర్దోషులమని వారు చెప్పే అవకాశం ఉంది. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా వారికి బెయిల్ లభించడం దాదాపు అసాధ్యమని, కస్టడీకి పంపడం ఖాయమని తెలుస్తోంది.

మదురోపై మోపిన అభియోగాలు చాలా తీవ్రమైనవి. టన్నుల కొద్దీ కొకైన్‌ను అమెరికాకు రవాణా చేయడం, దీనికోసం వెనిజువెలా సైన్యాన్ని, రహస్య ఎయిర్‌స్ట్రిప్‌లను వాడుకోవడం (నార్కో-టెర్రరిజం), అక్రమంగా మెషిన్ గన్లు కలిగి ఉండటం, మనీలాండరింగ్ వంటి కేసులు ఉన్నాయి. ఈ ఆరోపణలు రుజువైతే మరణశిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే స్విట్జర్లాండ్ ఆయన ఆస్తులను స్తంభింపజేసింది.

మరోవైపు, కోర్టు వెలుపల మదురో మద్దతుదారులు, వ్యతిరేకులు వందల సంఖ్యలో గుమిగూడారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మదురోను ఉంచిన ఎండీసీ జైలు అత్యంత కఠినమైన భద్రతకు, దారుణమైన పరిస్థితులకు పేరుగాంచింది. గతంలో మెక్సికన్ డ్రగ్ లార్డ్ 'ఎల్ చాపో' గుజ్‌మాన్, ఆర్థిక నేరగాడు సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ వంటి కరడుగట్టిన నేరగాళ్లను ఈ జైలులోనే ఉంచారు.

Nicolas Maduro
Venezuela
Cilia Flores
Federal Court
Narco-terrorism
Money Laundering
Drug Trafficking
US Relations
El Chapo Guzman
Sam Bankman-Fried

More Telugu News